బాబుపై మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
ఏపీ టాప్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసు నిద్ర లేకుండా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గడిచిన కొన్నేళ్లుగా అప్పుడప్పుడు ఆ కేసు తెరపైకి వస్తూ బాబును ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలేం మత్తయ్య చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాల్గొనకుండా చెయ్యాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మత్తయ్య ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తన పేరు చేర్చడాన్ని ఆయన ఖండించారు. ఎన్నికల ముందే కేసును దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మత్తయ్య డిమాండ్ చేశారు. ఈ కేసులో తనకు రాజకీయంగా న్యాయం జరగలేదని, తాను నిర్దోషినని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు.
సుప్రీం కోర్టులో ఉదయ్సింహతో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ లేదా ఎన్ఐఎతో ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఏపీభవన్లో నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు తెలిపారు. తాను చేపట్టబోయే దీక్షకు పలు క్రిస్టియన్ సంఘాలు మద్దతు తెలుపనున్నట్లు జెరూసలేం మత్తయ్య స్పష్టం చేశారు.